17-09-2025 12:36:58 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 16 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలకు గాంధారిలో రెడ్ క్రాస్ సంస్థ అండగా నిలిచింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారం వరద బాధితులకు ఊరటనిస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ గాంధారి మండల కేంద్రంలోని రైతు వేదికలో వరద బాధితులు 67 మందికి దుప్పట్లు, బెడ్షీట్లు, చీరలు, దొవతులు, టవల్స్ తో కూడిన కిట్లను ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సభ్యులతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ఇతర ఆపద సమయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహాయం అందిస్తుందని అన్నారు. జిల్లాలో ఇటీవల సంభవించిన భారీ వరదల ప్రభావానికి గురైన బాధితులను ఆదుకునేందుకు జిల్లాకు సహకారం అందించాలని కోరగా వెంటనే స్పందించి జిల్లాకు సుమారు 8 లక్షల రూపాయల విలువైన 400 దుస్తులు మరియు దుప్పట్ల తో కూడిన కిట్లను,
దెబ్బతిన్న ఇండ్లను కప్పుకోవడానికి 100 టార్పాలిన్ కవర్లను అందజేశారని సహాయ సామాగ్రిని పంపించిన రెడ్క్రా సొసైటీ రాష్ట్ర శాఖకు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న మరియు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
రాజంపేట,బిక్నూర్, బిబిపేట మరియు దోమకొండ మండలాల్లో సహాయ కిట్లను అందజేశామని ఈరోజు గాంధారి, ఎస్ ఎస్ నగర్, రామారెడ్డి మరియు పల్వంచ మండలాల్లో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, స్థానిక తాసిల్దార్, ఎంపీడీవో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.