1 July, 2026 | 7:53 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత

01-07-2026 06:44 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం జిల్లాలోని కెరమెరి మండలం అగర్వాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ రోజా సోనాజీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని తెలిపారు.

అన్ని ప్రభుత్వ పాఠశాలలలో సకల సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు అల్పాహారం, పోషకాలతో కూడిన రుచికరమైన మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను ఉచితంగా అందిస్తుందని తెలిపారు. ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత పై చదువులకు గురుకుల పాఠశాలలకు పంపించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని తెలిపారు.

ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు హాజరై 100 శాతం హాజరు నమోదు చేసేలా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. గ్రామ సర్పంచ్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి గ్రామానికి వెళ్లే రహదారి, గ్రామంలోని అంతర్గత రహదారులు, మురుగు కాలువల వ్యవస్థ నిర్మాణానికి, గ్రామంలో రేషన్ షాప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆడే ప్రకాష్, సర్పంచ్ రోజా సోనాజీ, ఉపాధ్యాయులు, పంచాయితీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.