calender_icon.png 12 May, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతీ పుష్కరాలకు ముఖ్యమంత్రి రాక.. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

12-05-2025 07:08:21 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించే సరస్వతి పుష్కరాల సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం పుష్కర పనులు పరిశీలిస్తూ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలలో ఏకైక త్రివేణి సంగమం, దేశంలో రెండో ప్రాంతం అయిన కాళేశ్వర క్షేత్రం అద్భుతమైన ఘట్టానికి వేదిక కాబోతుంది. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించే త్రివేణి సంఘమంలో అంగరంగ వైభవంగా పుష్కరాలు నిర్వహించుటకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఈ నెల 15వ తేదీ న అట్టహాసంగా ప్రాంరంభం కానున్న సరస్వతి నది పుష్కరాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారని తెలిపారు. ప్రతిరోజు కాశీ పీఠాధిపతులచే నది హారతి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.

ప్రతి రోజు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ 15వ తేదీన రాష్ట్రముఖ్యమంత్రి  సరస్వతి మాత విగ్రహం ఆవిష్కరించడంతో పాటు పుష్కరాలను ప్రారంభిస్తారని, గోదావరి హరతి, త్రిలింగ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు.  ప్రపంచంలో యముడు, శివుడు లింగాకరంలో వెలిసిన ఏకైక క్షేత్రం త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో సాక్షాత్కరిస్తుండడం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకతని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సరస్వతి పుష్కరాలకు అత్యంత అరుదైన చరిత ఉందన్నారు. సరస్వతి నది పుష్కర వేడుకులు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు చేపట్టినట్లు వివరించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. 

ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో సకల సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పనులు సకాలంలో పూర్తి చేయించేందుకు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని, అధికారులు కాళేశ్వరంలో ఉండి కేటాయించిన విధుల్లో నిమగ్నం కావాలని తెలిపారు. 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా కాళేశ్వరంలో ఏర్పాట్లలో నిమగ్నం కావాలని సూచించారు.  పుష్కరాలు నిర్వహించనున్న 12 రోజుల పాటు భక్తులకు సేవలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అంతా అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు చేశామన్నారు. జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, మహాదేవపూర్ కాటారం సిఐలు, ఎస్సైలు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.