30-01-2026 01:15:23 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లోని రూమ్ నెం. 13 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎం.సీ.ఎం.సీ)ను జిల్లా కలెక్టర్ కె హరిత ఆర్డీవో లోకేశ్వర్ రావు తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసిఎంసి విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఎంసిఎంసి సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, సకాలంలో ప్రచార ప్రకటనలకు సంబంధించిన ఎన్నికల వ్యయం ను లెక్కించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను గమనిస్తూ ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి వై సంపత్ కుమార్ కలెక్టరేట్ పరిపాలన అధికారి కిరణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.