15-09-2025 02:38:49 PM
పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్..
ప్రజావాణి ఫిర్యాదుల సంఖ్య 31
జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్(District Collector Satya Prasad) అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చే ప్రజల సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవచూపాలని అన్నారు.
ప్రజావాణి అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 31 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్, జగిత్యాల, మెట్ పల్లి, ఆర్డీఓలు మధు సూధన్, శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.