07-11-2025 06:15:02 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): యువత ఒక లక్ష్యాన్ని నిర్ణయించి, ముందుకు సాగాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు ఇచ్చారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 29వ జాతీయ యువజనో త్సవాలలో భాగంగా జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ మినీ స్టేడియంలో జిల్లాస్థాయి యువజనో త్సవాల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. విద్యార్థులు, యువత స్వామి వివేకానందుని సందేశాలను స్పూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాను అవసరం మేరకు వాడాలని సూచించారు.
పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాలల యువతీ యువకులు, కళాకారులు, వివిధ కళా బృందాలు పాల్గొన్నాయి. జానపద నృత్యాలు బృందం, జానపద గేయాలు జానపద గేయాలు బృందం, కథా రచన, పద్య రచన, కవిత్వం, చిత్రలేఖనం, వకృత్వం పోటీ నూతన ఆవిష్కరణలు /ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ మేళ వంటి పోటీలు నిర్వహించగా, దాదాపు 400 మంది యువతీ యువకులు, కళాకారులు పాల్గొన్నారు.