30-06-2025 09:05:38 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం(Ayushman Health Center)ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్(District Medical Health Officer Dr. B. Ravi Rathod) ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యసేవలు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు, రికార్డు నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. మాతా శిశు సంరక్షణ సేవలందించాలని, నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. స్టానిక ఎం.ఎల్.హెచ్.పి రికార్డుల నిర్వహణ సరిగా లేదంటూ అసహనం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో పునరావృతం కావొద్దని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో జబ్బులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గ్రామాలలో మెడికల్ క్యాంప్ లను నిర్వహించాలని, తమ ప్రాంతములో ఆశ్రమ పాఠశాలు వుంటే అక్కడి పిల్లలకు షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. గర్బిణీ స్త్రీల నమోదును 12 వారాలలోపు గానే పూర్తి చేయాలని, హై రిస్క్ గర్భిణులను ప్రసవం కోసం జిల్లా ఆసుపత్రికి పంపించాలని, వర్షాలు ఎక్కువగా వున్నట్లైతే కాన్పుకు దగ్గరగా వున్న వారిని ముందుగానే ఆసుపత్రికి తరలించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమములో స్థానిక ఆరోగ్య అధికారి డాక్టర్ యమున, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి, కొప్పు ప్రసాద్, స్థానిక ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.