21-06-2025 12:00:00 AM
మంచిర్యాల, జూన్ 20 (విజయక్రాంతి) : జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికైనట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గొనె శ్యామ్ సుందర్ రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ లు శుక్రవారం వెల్లడించారు. మందమర్రిలో ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో జరిగిన 54వ సీనియర్ మహిళల రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో జిల్లా జట్టులో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు మొదటి స్థానంలో నిలిచిందన్నా రు.
జిల్లా జట్టులో ప్రతిభ కనబర్చిన వేమనపల్లి మండలానికి చెందిన పోల్కా అనుష, బెజ్జూర్ మండలానికి చెందిన జ్యోతి, మంచిర్యాలకు చెందిన శృతి, కాగజ్ నగర్ కు చెందిన ఊర్వశిలు ఈ నెల 28 నుంచి జూలై 2 వరకు గుజరాత్ రాష్ట్రం బుజ్ లో జరిగే జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు వారు వెల్లడించారు. జాతీయ స్థాయి పోటీల్లో ఎంపికైన క్రీడాకారులతో పాటు కోచ్ సునార్కర్ అరవింద్ ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ కోశాధికారి రమేష్ రెడ్డి, రాకేష్, సాయి, గురువెందర్, జిల్లా సీనియర్ క్రీడాకారులు పాల్గొని అభినందించారు.