1 May, 2026 | 9:18 PM

ఖాకీ సక్సెస్

01-05-2026 08:18 PM

* జాతరలో పోలీసుల చర్యలు భేష్

* తలెత్తని ట్రాఫిక్ సమస్య

* సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు

మంగపేట,(విజయక్రాంతి): రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన శ్రీహేమాచల క్షేత్రంలో(మల్లూరు గుట్ట) శుక్రవారం జరిగిన శ్రీలక్ష్మీ నృసింహ స్వామి తిరు కళ్యాణం సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకెన్, ఏటూరునాగారం ఏఎస్పీమనన్ బట్ ఆదేశాల మేరకు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, మంగపేట యస్ఐ టి.వి.ఆర్.సూరి ఆధ్వర్యంలో మల్లూరు గ్రామంలోని ఆర్చీ నుండి ఆలయం వరకు, కళ్యాణ మండపం వద్ద, ఉత్సవ విగ్రహాలను కళ్యాణ మండపం వద్దకు తీసుకు వచ్చే సమయంలో జాతర ప్రాంగణంలో పోలీసులు తగిన బందోబస్తు నిర్వహించారు. 

ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్ , మంగపేట యస్ఐ టి.వి.ఆర్.సూరి, మంగపేట రెండవ యస్ఐ శ్రీకాంత్, ఏటూరునాగారం యస్ఐ మహేష్ తదితరులు రెండు టీంలుగా ఏర్పడి ఒక టీం మల్లూరు గ్రామంలోని ఆర్చీ నుండి హేమాచల క్షేత్రంపై ఉన్న ఆర్చీ వరకు, మరో టీం కళ్యాణ మండపం వద్ద బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలలో భాగంగా వాహనాల పార్కింగ్, వాహనాల డైవర్షన్ కోసం పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పాయింట్లు ఏర్పాటు చేయడంతో జాతర సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తలేదు. మల్లూరు గ్రామం నుండి హేమాచల క్షేత్రం వరకు ట్రాఫిక్ ను పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కళ్యాణ మండపం వద్ద తగిన బందోబస్తు నిర్వహించారు. కళ్యాణం సందర్భంగా పోలీసులు ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవడంపై జాతరకు వచ్చిన భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.