ప్రజలకు మేలు చేయాలి
ట్రైనీ ఐఏఎస్లకు గవర్నర్ సూచన
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ప్రజా సమస్యలకు సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని, ఉన్నతాధికారిగా సామాన్యులకూ అందుబాటులో ఉండాలని 2023 ఐఏఎస్ ట్రైనీలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. తెలంగాణ క్యాడర్కు చెందిన ట్రైనీ ఐఏఎస్లుగా రాష్ట్రానికి వచ్చారు. వీరంతా హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేసే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, వాటికి ఎదురీది ముందుకు సాగుతూ ప్రజలకు మేలు చేయాలన్నారు.
అనంతరం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కూడా కలిశారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయల్ ట్రైనీ ఐఏఎస్లను భట్టికి పరిచయం చేశారు. వీరికి కేటాయించిన జిల్లాలు, గత ఎన్నికల్లో నిర్వహించిన విధుల గురించి వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. నిబద్ధతో పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని సూచించారు. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటే ఉద్యోగంలో సంతృప్తి దొరుకుతుందని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి లోతుగా అధ్యయనం చేస్తే ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.






