21-02-2026 02:09:11 AM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్ , ఫిబ్రవరి 20: అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మరోమారు భారత్ -పాక్ మధ్య సాగిన ఆపరేషన్ సిందూర్ను ప్రస్తావించారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోమారు చెప్పుకొచ్చారు. 200% సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తేనే రెండు దేశాలు శాంతించాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ’బోర్డ్ ఆఫ్ పీస్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, మే 2025 నాటి భారతదేశం, పాకిస్తాన్ సైనిక ఉద్రిక్తతలను ఆయన ప్రస్తావించారు. ఈ ఘర్షణల్లో ఖరీదైన 11 యుద్ధ విమానాలు కూడా కూలిపోయాయని చెప్పుకొచ్చారు.
పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్య లు చేయడం గమనార్హం. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం ఆపినప్పుడు తనను 25 మిలియన్ల ప్రజలు ప్రశంసించారని చెప్పారు. ’నాకు మోదీ బాగా తెలుసు. ఆయనకు ఫోన్ చేసి వినండి. యుద్ధం ఆపక పోతే మీ ఇద్దరితో వాణిజ్య ఒప్పందాలు చేసుకోము అని చెప్పాను.
మీరు యుద్ధం కొనసాగిస్తే రెండుదేశాలపై 200% సుంకం వేస్తామని కూడా అన్నాను. డబ్బు విషయానికి వస్తే ఎవరైనా వెనుకడుగు వేస్తారు. అప్పటికే 11 జెట్లను కూల్చివేశారన్నారు.’ తన మధ్యవర్తిత్వంలో ఇరు దేశాలు దిగి వచ్చి యుద్ధం ఆపాయని చెప్పారు. అయితే, ఇరు దేశాల మధ్య తానే రాజీ కుదిర్చానంటూ ట్రంప్ ఇప్పటి వరకూ 80 సార్లకు పైగా వివిధ వేదికల్లో చెప్పుకొచ్చారు. ట్రంప్ ప్రకటన వెలువడిన ప్రతిసారీ భారత్ ఖండిస్తూ వస్తోంది.