ఇరాన్పై భీకర దాడికి ట్రంప్ సన్నద్ధం
వాషింగ్టన్: ఇరాన్ పై భీకర దాడికి అమెరికా పూర్తి సన్నద్ధంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రకటించారు. ఇరాన్ తో అమెరికా ప్రతినిధుల బృందం చర్చిస్తుందని వెల్లడించారు. చర్చల నేపథ్యంలో భీకర దాడికి దిగే పరిస్థితులు రాకపోవచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. మధ్యంతర ఎన్నికల దృష్ట్యా యుద్ధాన్ని ముగించాలన్న ఒత్తిడి తనపై లేదని సూచించారు. ఎన్నికల గురించి తర్వాత ఆలోచించవచ్చని పేర్కొన్నారు. తాను గనుక అధ్యక్షుడిగా ఎన్నికై ఉండకపోతే ఇజ్రాయెల్ ఇక ఉనికిలో ఉండేది కాదని తెలిపారు. అది అణు దాడికి గురయ్యేదని శుక్రవారం ఓవల్ ఆఫీస్ నుండి అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
"ఒకవేళ ఇరాన్ వద్ద అణు ఆయుధం ఉండి ఉంటే, వారు దానిని ఉపయోగించి ఉండేవారు. నేడు మనకు తెలిసినట్లుగా మధ్యప్రాచ్యం (Middle East) ఉండేది కాదేమో కానీ, నా అభిప్రాయం ప్రకారం, కచ్చితంగా ఇజ్రాయెల్ మాత్రం ఉండేది కాదు." అని ట్రంప్ వెల్లడించారు. తాజా నివేదికల ప్రకారం, ఇరాన్ ఒక అమెరికన్ విమాన వాహక నౌకపై భారీ క్షిపణి, డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో సైనికులు, సిబ్బందితో సహా దాదాపు 200 మంది తక్షణమే మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.






