26-06-2025 12:45:23 AM
పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వద్దు
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): వానకాలం సీజన్ కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, అందుకే యంత్రాంగం పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం మున్సిపల్ అడ్మినిస్టేషన్, అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రోడ్డుపై వరద నిలిచే ప్రాంతాలను గుర్తించి, వెంటనే అక్కడ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ఉప్పొంగి డ్రైనేజ్ ఓవర్ ఫ్లో కాకుండా చూడాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్షిత నీరే సరఫరా చేయాలని సూచించారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించాలన్నారు. తాగునీటి సరఫరా, డ్రైనేజ్, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించిన పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పాతికేళ్ల అంచనాతో ప్రణాళికలు ఉండాలన్నారు.
కోర్ అర్బన్ తో పాటు సెమీ అర్బన్, రూరల్ ఏరియా అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో తాగునీటి సరఫరా, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల పురోగతి గురించి సీఎంకు వివరించారు.
సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్రాజ్, హెచ్ఎండీఏ ఎంఏయూడీ సెక్రటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఏ డిస్ట్రిక్ట్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఎఫ్సీడీఏ కమిషనర్ కే శశాంక, జలమండలి ఎండీ అశోక్రెడ్డి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు.
సర్కారు బడులను కలెక్టర్లు సందర్శించాలి
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం సూ చించారు. విద్యా శాఖపై బుధవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని సీఎంకు అధికారులు వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని సీఎం ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన వసతులను పాఠశాలల్లో కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించా రు.
మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల నుంచి మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు విముక్తి కల్పించాలని.. సోలార్ కిచెన్లు ఏర్పాటుపై తక్షణమే దృష్టి సారించాలని అధికారులకు రేవంత్రెడ్డి ఆదేశించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్మీడియెట్లో నమోదవుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉండడంపై అధికారులను ప్రశ్నించారు.
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యా ర్థులంతా కచ్చితంగా ఇంటర్మీడియట్లో చేరేలా చూడాలని సూచించారు. ఇంటర్మీడియెట్ అనంతరం జీవనోపాధికి అవసర మైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చని.. తద్వారా వారి జీవితానికి ఢోకా ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఏ శ్రీదేవసేన, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం హరిత తదితరులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ కౌన్సిలింగ్పై ఆరా!
ఇంజినీరింగ్ ఫీజులు, కౌన్సిలింగ్పైన కూడా సీఎం ఆరా తీసినట్టు సమాచారం. ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషన్లకు ఈ నెల 30 వరకు గడువుందని సీఎంకు ఈమేరకు అధికారులు వివరించినట్లు తెలిసింది. ఇప్పటికే జూలై మొదటి వారం నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలం గాణ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఏఐసీటీఈ నుంచి మరో నాలుగైదు కాలేజీలకు ఇంకా అనుమతి రావాల్సి ఉంది.
ఈక్ర మంలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్పై అధికారులు ముందుకు పోవడంలేదు. ప్రభుత్వం మాత్రం ఈ విద్యాసంవత్సరానికి పాత ఫీజులతోనే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిం చాలని తెలంగాణ ఉన్నత విద్యామండలికి సూచించింది. బుధవారం విద్యాశాఖపై జరిగిన సమీక్షలో ఇంజినీరింగ్కు సంబంధించి స్వల్ప చర్చ వచ్చినట్టు తెలిసింది.