31-12-2025 01:34:01 AM
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి) : అక్రిడిటేషన్ కార్డులకు, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా అక్రిడిటేషన్ కార్డుదారులకు వర్తించే ప్రతి ప్రయోజనం మీడియా కార్డు దారులకు కూడా వర్తిస్తుందని తెలి పారు. ఈ విషయంలో డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, జీవో 252లో మార్పులు చేసి లిఖిత పూర్వకంగా ఇస్తామని హామీ ఇచ్చారు.
మంగళవారం సచివాలయంలో తనను కలిసిన టీడబ్ల్యుజేఎఫ్, డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులతో మంత్రి వివిధ అంశాలపై చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు. కొంతమంది అపోహలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని, ఎలాంటి పక్షపాతం లేదన్నారు. మీరెవరూ ఆందోళన చెందొద్దని, మీతో నేనున్నానని భరో సా ఇచ్చారు. రెండు విభాగాలుగా చూడాలన్న ఆలోచన కాదని, ప్రభుత్వ పరంగా అన్ని సంక్షేమ పథకాలను వర్తింపచేస్తామని స్పష్టం చేశారు.
అర్హులైన జర్నలిస్ట్లకు మేలు చేయాలన్న సంకల్పం, సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు. తెలంగాణ రాష్ర్టంలో మినహా దేశంలో ఇంత పెద్దమొత్తంలో అక్రిడిటేషన్ కార్డులు ఇస్తున్న రాష్ర్టం మరొకటి లేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాష్ర్టంలోని అన్ని జర్నలిస్ట్ సంఘాలతో సమావే శం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి డెస్క్ జర్నలిస్ట్లను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు.
అందరి అభిప్రాయాల ను, సలహాలను సూచనలను తీసుకొని జర్నలిస్ట్లకు మరింత ప్రయోజనం చేకూరే విధంగా జీవో 252లో మార్పులు, చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ర్ట నాయకులు బీ. రాజశేఖర్, గండ్ర నవీన్ ఆధ్వ ర్యంలో మంత్రిని కలిసిన వారిలో ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శులు ఉపేందర్, మస్తాన్, నాయకులు నిస్సార్, విజయ, రాజారాం, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు కృష్ణ, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.