20-02-2026 02:03:56 AM
కందుకూరు, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): స్థానిక గ్రామ పరిధిలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు మత్తు పదార్థాల వినియోగం, వాటి వల్ల కలిగే అనర్థాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువా రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ కె. సీతారాం, కందుకూరు గ్రామ సర్పంచ్ సరికొండ పాండు మరియు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు పలు కీలక సూచనలు చేశారు.
ఒడిశా, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి ఇక్కడ నివసిస్తున్న కార్మికులను ప్రధాన రహదారిపై సమీకరించి, గంజాయి మరియు ఇతర డ్రగ్స్ వాడకం వల్ల కలిగే ప్రాణాంతక ఆరోగ్య సమస్యలను వివరించారు. మత్తు పదార్థాలకు బానిసవ్వడం వల్ల కేవలం వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా, కుటుంబాలు రోడ్డున పడతాయని, యువత భవిష్యత్తు అంధకారమవుతుందని ఇన్స్పెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
గంజాయి లేదా మరే ఇతర మత్తు పదార్థాలను కొనుగోలు చేసినా, విక్రయించినా లేదా రవాణా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగం సమాజానికి చీడపురుగు వంటిది. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి, చట్టబద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి.
ఎవరైనా గంజాయి విక్రయించినా లేదా వినియోగిస్తున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు. కార్మికులు ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపాలని, తమ సంపాదనను వ్యసనాలకు కాకుండా కుటుంబ శ్రేయస్సు కోసం వినియోగించాలని వారు సూచించారు.