calender_icon.png 1 June, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించండి

30-05-2025 07:43:18 PM

ఉపాధ్యాయులకు పోలీసుల విజ్ఞప్తి

మహబూబాబాద్,(విజయక్రాంతి): సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, పోక్సో చట్టం, షీ టీమ్స్ రక్షణ తదితర అంశాలపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తే, వారు తమ తల్లిదండ్రులకు అవగాహన పెంపొందిస్తారని, ఫలితంగా ప్రజలు ఎలాంటి నేరాల బారిన పడకుండా ఉండవచ్చని మహబూబాబాద్ షీ టీం ఎస్సై సునంద, సైబర్ క్రైమ్ ఎస్సై కరుణాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలను, సైబర్ నేరాలకు గురికాకుండా ముందస్తు నివారణ చర్యలు, పోక్సో చట్టంపై డిజిటల్ బోర్డ్ పై దృశ్య ప్రదర్శన ద్వారా వివరించారు.

బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు పిన్ నెంబర్, ఓటిపి వివరాలు ఇతరులకు వెల్లడించడం ద్వారా జరిగే ఆర్థిక నష్టాలను వివరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి చెప్పాలని, వేధింపులకు ఇతర సంఘటనలకు గురైనప్పుడు 100కు డయల్ చేయాలని సూచించారు. షీ టీం రక్షణ కోసం క్యూఆర్ కోడ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ద్వారా సంప్రదించవచ్చని చెప్పారు. వ్యక్తిగత విషయాలను, ఫోటోలను సోషల్ మీడియాలో ఇతరులకు గాని షేర్ చేయకూడదని చెప్పారు. ఆపదలో ఉన్నవారు 8712656935 నెంబర్ కు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో షీ టీం సిబ్బంది అరుణ, పార్వతి, రమేష్ పాల్గొన్నారు.