calender_icon.png 20 June, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన పరిజ్ఞానంతో విద్యాబోధన

20-06-2025 12:57:25 AM

బండారుపల్లి మోడల్ స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్ ఆవిష్కరణ.

మంత్రి సీతక్క

ములుగు, జూన్19 (విజయక్రాంతి)  : ములుగు జిల్లాలో నూతన పరిజ్ఞానంతో విద్యా బోధన అందించడం జరుగుతుందని,విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటూనే చదువుతోపాటు సంస్కారం నేర్చుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళ,శిశు సంక్షేమ శాఖమంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లిలోని పిఎం శ్రీమోడల్ స్కూల్ లో మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్,గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ లతో కలసి పాఠశాలలో కొత్తగా కంప్యూటర్ ల్యాబ్ ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత సంవత్సరం పలు కంపెనీల సహకారంతో పాఠశాలలోని విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా విద్యా బోధన చేయడానికి అవకాశాలను మెరుగుపరచడం జరిగిందని అన్నారు.

విద్యార్థులకు త్వరగతిన ఇంగ్లీష్ రావడానికి కంప్యూటర్లు ఎంతగానో దోహదపడుతున్నాయని,ప్రతి ఒక్కరికి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ ఇంగ్లీష్,కంప్యూటర్ జ్ఞానం లేని పక్షంలో అంత వృధా అవుతుందని,రానున్న రోజులలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ లను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ములుగు లాంటి గిరిజన ప్రాంతంలోని విద్యార్దులు చదువులో బాగా రానిస్తూనే పాఠశాల స్థాయి నుండే సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకొని,అభివృద్ధి చెందిన ఇతర ప్రాంతాల విద్యార్దులకు ధీటుగా ఉన్నత స్థానంలో స్థిరపడాలని అన్నారు.మహిళా సంఘాలను బలోపేతం చేయడమే ప్రభుత్వం లక్ష్యం. 

మహిళలు ఆర్థిక స్వావలంబన చెందాలి

ములుగు,జూన్19(విజయక్రాంతి): మహిళా సంఘాలను బలోపేతం చేసి వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.గురువారం ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామం  ఆశ్రమ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కుట్టు మిషన్ ఉచిత శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్,ధ్రువపత్రాలను రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ చాలా మంది నైపుణ్యం లేని కారణంగా ఉపాధికి దూరంగా ఉంటున్నారని,దూర ప్రాంతాలకు పనికోసం వెళ్ళి మళ్ళీ ఇంటికి వెనుతిరిగి వస్తున్నారని,ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మహిళలు ఉన్నదగ్గరనే ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో వారికి ఈ కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినదని అన్నారు. వివిధ పాఠశాలల్లో అవసరమైన మేరకు ఏకరూప దుస్తులను మహిళా సంఘాలకు ఆర్డర్ ఇచ్చి వారి ద్వారా విధ్యార్థులకు బట్టలు కుట్టించడం ద్వారా మహిళా సంఘాలకు దాదాపు 30కోట్ల రూపాయల లాభం వారికి చేకూర్చడం జరిగినదని తెలిపారు.

భవిష్యత్తులో రాబోయే విద్యాసంస్థలలోని పిల్లలకు కూడా మహిళా సంఘాల ద్వారానే బట్టలు కుట్టేలా వారికి ఆర్డర్ లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.  15 సం.ల నుండి 60 సం.ల లోపు వయస్సున్న మహిళలు అందరూ తప్పకుండా మహిళా సంఘాలలో చేరాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత కొరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ లు,ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు,బస్సులు,సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అవకాశాలను అందించడం జరుగుతుందని అన్నారు.  మహిళలు ప్రభుత్వ సహకారాన్ని వినియోగించుకొని ఉన్నతంగా ఎదగాలని,తద్వారా తెలంగాణ ప్రగతి పథంలో నడిచేలా మనమంతా ముందడుగు వేద్దామని అభిలషించారు.