calender_icon.png 20 June, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు చేరుకున్న 110 మంది విద్యార్థులు

20-06-2025 12:58:10 AM

  1. ‘ఆపరేషన్ సింధు’ పేరిట ఇరాన్ నుంచి తరలింపు
  2. ఆర్మేనియా రాజధాని యెరవాన్ మీదుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి
  3. విద్యార్థుల్లో 90 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందినవారు

న్యూఢిల్లీ, జూన్ 19: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న వేళ ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు కేంద్రం ‘ఆపరేషన్ సింధు’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇరాన్ నుంచి 110 మందితో కూడిన విద్యార్థుల బృందం సురక్షితంగా ఢిల్లీకి చేరుకుంది.

బుధవారం ఆర్మేనియా రాజధాని యెరవాన్ నుంచి విద్యార్థులంతా ప్రత్యేక విమానంలో బయల్దేరగా.. తాజాగా గురువారం తెల్లవారుజామున వీరంతా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే భారత్‌కు తిరిగి వచ్చిన వారిలో 90 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందినవారే కావడం గమనార్హం. కాగా స్వదేశానికి తిరిగి రావడంపై విద్యార్థులంతా హర్షం వ్యక్తం చేశారు.

తమను ఇరాన్ నుంచి సురక్షితంగా భారత్‌కు తీసుకురావడంపై ప్రధాని మోదీ, విదేశాంగ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌లో మొత్తం 4 వేలకు పైగా భారత పౌరులు ఉండగా.. అందులో మెడిసిన్, తదితర కోరుల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ నగరం దద్దరిల్లుతోంది.

టెహ్రాన్‌ను వీడాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడి స్థానిక ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇంకా టెహ్రాన్ వీడని భారత పౌరులు ఎవరైనా ఉంటే వెంటనే ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు ఇజ్రాయెల్‌లోనూ ‘ఆపరేషన్ సింధు’ పేరిట భారత పౌరులను స్వదేశానికి తరలించాలని నిర్ణయించింది. ఉద్రిక్త పరిణామాల దృశ్యా భారత్‌కు రావాలనుకుంటున్న పౌరుల్ని తరలించేందుకు టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు భారత ఎంబసీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.