10-06-2025 11:12:29 PM
జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ..
గద్వాల (విజయక్రాంతి): బాల కార్మిక వ్యవస్ధను, బాల్య వివాహాలను సమూలంగా నిర్మూలించేందుకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ(District Additional Collector Lakshmi Narayana) అన్నారు. మంగళవారం ఐడీఓసీ తమ ఛాంబర్ నందు అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్ధ వ్యతిరేక దినోత్సవ(International Day Against Child Labor) సందర్భంగా ప్రత్యేక డ్రైవ్ పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేకత దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 9 నుండి 14 వరకు బాల కార్మికుల రక్షణ, గుర్తింపు పునరావాసంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు.
తల్లిదండ్రులు పిల్లలను పనిలో పెట్ట కుండా, వారి ఆర్ధిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్పెషల్ డ్రైవ్ టీమ్ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలు,షాపులు, ప్రమాదకర ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు.14 సంవత్సరాల్లోపు బాల బాలికలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత యజమానులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని, 18 సంవత్సరాల్లోపు వారైతే బాలల న్యాయ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు.
అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బాలల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు స్వచ్ఛంద సేవా సంస్థలు, యువత తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ అధికారి వేణు గోపాల్, డీడబ్ల్యూవో సునంద, డీసీపీవో నరసింహ, తదితరులు పాల్గొన్నారు.