24-05-2025 05:17:31 PM
ఇచ్చిన హామీ మేరకు మంజూరు పట్టాలు ఇస్తున్నాము..
కోనరావుపేట మండల అభివృద్ధికి కృషి..
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్..
సిరిసిల్ల (విజయక్రాంతి): పేదవారి ఆత్మగౌరవ ప్రతీక సొంత ఇల్లు అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Aadi Srinivas) తెలిపారు. శనివారం కోనరావుపేటలో రెండో విడత క్రింద 561 ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉత్తర్వులు విప్, జిల్లా కలెక్టర్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. తాము ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశామని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం 3500 ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. నిర్ణీత సమయం, ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం ఇల్లు నిర్మించుకొని సహాయం పొందాలని పిలుపునిచ్చారు.
కోనరావుపేట మండలంలోని బ్రిడ్జిలు త్వరితగతిన పూర్తి చేయిస్తామని తెలిపారు. మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) మాట్లాడుతూ... కోనరావుపేట మండలంలో 561 మంది లబ్ధిదారులను పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి ఉత్తర్వులు పంపిణీ చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని, 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని స్పష్టం చేశారు. 4 దశలో గ్రీన్ చానల్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తైన తర్వాత లక్ష రూపాయల, గోడలు నిర్మిస్తే లక్ష రూపాయలు, స్లాబ్ నిర్మించిన తరువాత 2 లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు.
ఎవరైనా డబ్బులు అడిగితే ఫోన్ చేయండి..
ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళారి నుంచి పైరవి వంటి చేయాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే స్వయంగా ఫోన్ చేయాలని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికి ఒక రూపాయి ఇవ్వడానికి వీలు లేదని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి అందిస్తామని, నిర్మాణానికి అవసరమైన ఇసుక మండల కేంద్రాలలో అందుబాటులో పెడతామని తెలిపారు. ఇంటి నిర్మాణానికి ఒక్కో దశలో అవసరమైన ఇసుక కోసం, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. రవాణా ఛార్జీలు చెల్లించాలని కలెక్టర్ సూచించారు. 30 రోజులలోగా నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించని పక్షంలో మంజూరు చేసిన ఇండ్లు రద్దు అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, పిడి హౌసింగ్ శంకర్, సంబంధిత అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.