03-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి) : రైతులు పండించిన సోయా పం టను ఎకరానికి 7.6 క్వింటాళ్లు కొనుగోలు చేస్తున్నారని, దాన్ని 10 క్వింటాలు కొనుగోలు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం సోయా కొనుగోలు కేంద్రాన్నీ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లను ఎకరానికి 10 క్వింటాలకు పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావుకు ఫోన్ చేసి రైతుల సమస్యలను విన్నవించారు.
ముందుగా తూకం కాంటాకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి, మార్కెట్ కు పంటను తీసుకొచ్చిన తొలి రైతును శాలువాతో సత్కరించి కొనుగోలు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతుల సమస్యలను మానవతా దృక్పథంతో ఆలోచిస్తూ పంటలను ప్రభుత్వాలు మద్దత్తు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. గతంలో అధికారంలో ఉన్న నాయకులు అప్పుడు రైతులను పట్టించుకోలేదని, ఇప్పుడు రైతులపై ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.
సోయా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, మార్క్ ఫెడ్ అధికారి ప్రవీణ్, బీజేపీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.