09-06-2025 01:01:19 AM
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
రామాయంపేట, జూన్ 8: నాణ్యమైన వైద్య సేవలకు నిలయాలుగా మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు నిలుస్తాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు. ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామాయంపేట మండలంలో విస్తృతంగా పర్యటించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.
ఆసుపత్రి డాక్టర్లు, అధికారులతో కలియతిరిగి అందుతున్న వైద్య సేవల గురించి రోగులను నేరుగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే సాధ్యపడుతుందని తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది హాజరు పట్టికలు, మందుల నిల్వల రిజిస్టర్, ఓపి రిజిస్టర్ , సీజనల్ వ్యాధులపై రక్త నమూనాల సేకరణ సంబంధిత రిజిస్టర్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్య సేవలపై ఆసుపత్రి సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అవసరమగు మందులు నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు పాల్గొన్నారు.