ఉపముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
గద్వాల,(విజయక్రాంతి): ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈనెల 14న వివిధ విద్యుత్ ఉపకేంద్రాల ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం మల్దకల్ మండలం కుర్తి రావులచెరువు గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి కేంద్రం ప్రారంభోత్సవం అనంతరం సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.
బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ గురించి స్థానిక బూత్ లెవెల్ అధికారులతో మాట్లాడారు. గ్రామంలోని యువత, బిఎల్ఎలు, వాలంటీర్ల సహకారం తీసుకొని ఎన్నుమరేషన్ ఫారాలను పూరించాలన్నారు. ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.






