calender_icon.png 17 December, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

17-12-2025 12:00:00 AM

డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్

మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 16: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు విడతల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఆదరించడంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందినట్లు తెలిపారు.

మూడో విడత ఎన్నికల్లో కూడా గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా నిలిచి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎవరి జనాభా ఎంతనో వారికి అంతస్థాయిలో వాటా ఉండాలన్న రాహుల్ గాంధీ ఆలోచన మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే అమలుచేయలేదన్నారు. పార్టీ పరంగా జనరల్ సీట్లలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ ఆఖ్తర్ మాట్లాడుతూ బీహార్లో ఆయూష్ సర్టిఫికెట్ల పంపిణీలో సీఎం నితిష్ కుమార్ ఓ ముస్లిం మహిళ హిజాబ్ ను తీసివేయడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. సీఎంస్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సమంజసం కాదని, ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నితీష్ కుమార్ చేసిన చర్యపై దేశంలోని ప్రజాస్వామికవాదులు. మేధావులు తీవ్రంగా ఖండించాలని కోరారు. ఈ సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, నాయకులు సీజే బెనహర్, అజ్మత్ ఆలీ, రాములు యాదవ్, బాలస్వామి, కంచిమి లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, మొయిజ్ తదితరులు పాల్గొన్నారు.