17-12-2025 12:00:00 AM
వీర్నపల్లి,ఎల్లారెడ్డిపేట,డిసెంబర్ 16 (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్ ఎన్నికల్లో అర్హులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పిలుపు ఇచ్చారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్ మండలాల్లో మూడో ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా వీర్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించి, అధికారులు, సిబ్బందితో మాట్లాడారు.
అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట జూనియర్ కళాశాల ఆవరణలో ఇంచార్జి కలెక్టర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లి మండలాల్లో ఈ నెల 17 వ తేదీన బుధవారం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 80, వార్డుల్లో 551 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నామని వెల్లడించారు.
ఎన్నికలకు నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 914 మంది ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు 1,244 మంది విధులు నిర్వర్తించనున్నారని తెలిపారు. క్రిటికల్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. ఎఫ్ ఎస్ టీ, ఎస్ ఎస్ టీ టీంలు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ఎస్ ఈ సీ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇంక ఇతర సామగ్రి సరి చూసుకోవాలని సూచించారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామగ్రి తరలించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.ఉదయం 07.00 గంటల నుంచి మధ్యాహ్నం 01.00 గంటల వరకు పోలింగ్ ఉంటుందని వివరించారు. మధ్యాహ్నం 02.00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు.
ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.పరిశీలనలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, మండల ప్రత్యేక అధికారులు క్రాంతి కుమార్, అఫ్జల్ బేగం, తహసీల్దార్లు ముక్తార్ పాషా, తదితరులు పాల్గొన్నారు.