19-06-2025 12:01:55 AM
80 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
మహబూబాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): రూ.80 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ వలకు విద్యుత్శాఖ ఉన్నత స్థాయి అధికారి చిక్కారు. మహబూబాబాద్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ)గా విధులు నిర్వహిస్తున్న జే నరేశ్ ఓ గుత్తేదారుకు రూ.20 లక్షలకు పైగా విలువైన పనులకు అనుమతి ఇవ్వడానికి రూ.లక్ష డిమాండ్ చేసినట్టు ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
జిల్లాలోని మరిపెడ మధ్యలో విద్యుత్ లైన్ మరమ్మతులు, మెయింటెనెన్స్ పనులు చేపట్టడానికి జిల్లాకు చెందిన క్లాస్ 1 కాంట్రాక్టర్ రూ.20 లక్షల లోపు పనులు చేపట్టగా, పనుల అంచనా దాటిపోవడంతో ఎన్పీడీసీఎల్ ఏఈ, డీఈలు సంతకం చేసి పరిమితి పెంచడానికి ఎస్ఈ అనుమతి కోసం ఫైల్ పంపారు. ఫైల్పై ఎస్ఈ నరేశ్ సంతకం పెట్టకుండా తొక్కి పెట్టాడు. కాంట్రాక్టర్ ఎస్ఈ నరేశ్ వద్దకు పలుమార్లు వెళ్లి అడగగా, రూ.లక్ష లంచం డిమాండ్చేశాడు.
ఈ నెల 14న రూ.20 ముట్టజెప్పగా, మిగిలిన రూ.80 వేలు తెచ్చి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని సంప్రదిం చాడు. బుధవారం మహబూబాబాద్లోని తన ఇంటి వద్ద కాంట్రాక్టర్ నుంచి ఎస్ఈ నరేశ్ రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్ఈని ఏసీబీ కోర్టులో హాజరుపరచినట్టు డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులెవరైనా లంచం అడిగితే ఎవరికీ భయపడకుండా 1064 టోల్ఫ్రీ నెంబర్కు సంప్రదించాలని సూచించారు.