07-06-2025 01:21:47 AM
లోపల ఆవేదన.. బయట ఆమోదం!
హైదరాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయుల పెం డింగ్ సమస్యలపై గురువారం ప్రభుత్వం చేసిన ప్రకటనపై లోపల ఆవేదన చెందుతూ బయటకు ఆమోదం పలికినట్లుగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తీరు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు మాత్రం ప్రభుత్వంపై గుర్రు గా ఉన్నారు. తమ సమస్యలు కొండం త ఉంటే.. చేసింది గోరంతా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఆశ లు రేపి ఉసూరుమనిపించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమ స్యలు 57 ఉంటే, అందులో 12 ఆర్థికపరమైన అంశాలు కాగా, 45 ఆర్థికేతర అంశాలున్నాయి. అయితే వీటిలో ఆర్థికపరమైన మూడు అంశాలు, ఆర్థికేతర లోని ఏడు అంశాలకు మాత్రమే ప్రస్తు తం మోక్షం లభించిందని ఉద్యోగ జేఏసీలోని ఓ నేత పేర్కొన్నారు.
మిగతా అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అటు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, ఇటు రాష్ట్రప్రభుత్వ తీరుపై కిందిస్థాయి ఉద్యోగులు తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరో రెండు డీఏలు జమవుతున్నాయి
మొన్నటివరకు మొత్తం ఐదు డీఏలు పెండింగ్లో ఉండేవి. ఇందులో ఒక డీఏ ఇప్పుడు, మరొక డీఏ ఆరు నెలల తర్వాత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జూలై వస్తే ఇంకో డీఏ, జనవరి వస్తే మరొక డీఏ ఇవ్వాల్సి వస్తుందని, మొత్తంగా చూసుకుంటే మళ్లీ ఆరు డీఏలు జమవుతున్నాయని అంటున్నారు. ఆరు నెలల తర్వాత ఇచ్చే డీఏకు ఇప్పుడు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తం ఐదు పెండింగ్ల్లో కంటితుడుపు చర్యగా ఒక డీఏను ఇవ్వడాన్ని ఏవిధంగా చూడాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఉద్యోగ జేఏసీ తీరుపై సోషల్ మీడియాలో ఇలా..
ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల తీరుపై ఉద్యోగవర్గాలు సోషల్ మీడియా వేదిక తమ అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వైఫల్యాలను ఎండగడుతూ పోస్టులు పెడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు పెట్టిన పోస్టుల్లో కొన్ని ఇలా ఉన్నాయి. ‘తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఏం సాధించిందో స్పష్టంగా చెప్పాలి..సమ్మె నోటీస్ ఇవ్వాలి.. పీఆర్సీ ఊసేలేదు.. డీఏనే ఇవ్వలేదు..ఇక పీఆర్సీ ఇస్తారా? సంఘం నాయకులు అసలు ఏం చేస్తున్నారు..? రాజీలేని పోరాటం చేయాల్సిన ఉద్యోగ సంఘాలు..ప్రభుత్వానికి భజన సంఘాలుగా తయారయ్యాయి.’ అని పోస్టుల్లో విరుచుకుపడుతున్నారు.
ప్రభుత్వ చొరవకు అభినందనలు: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ చొరవకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అభినందనలు తెలిపింది. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటనను ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు విడుదల చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటూ పరిష్కరించుకోవాలనే ఆలోచనలో ఉద్యోగులున్నారని తెలిపారు.
పలు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం సంతోషాన్ని కల్గించిందని, వీటితోపాటు పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా ఉన్నాయని, వాటిని కూడా ప్రాధాన్యక్రమంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం, ప్రభుత్వ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
దాటవేత ధోరణిలో ప్రభుత్వం: ఉద్యోగులు
తెలంగాణ ఉద్యోగుల పట్ల ప్రభుత్వపు మోసం,- దగా చేస్తోందని సోషల్ మీడియాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు విరుచుకుపడుతున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్కు చెల్లించాల్సిన ఐదు డీఏలకు గాను..ఒకటి చెల్లించి..ఇంకోటి అర్నెళ్ల తర్వాత ఇస్తామని ఉద్దెర మాటలు చెప్పడం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను మోసం చేయడం కాదా? అని నిలదీస్తున్నారు.
ఇక జూలై 2023 నుంచి అమల్లోకి రావాల్సిన పీఆర్సీ అంశం క్యాబినెట్ ప్రకటనలో ఊసేలేదన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు కావొస్తున్నా..ఇంకా రేపు-మాపంటూ ఉద్యోగులను మభ్యపెడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే డిమాండ్ల సాధనకు ఈనెల 9న తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని ఉద్యోగుల జేఏసీ వాయిదా వేసిన విషయం తెలిసిందే.