20-06-2025 12:50:54 AM
మహబూబాబాద్, జూన్ 19 (విజయ క్రాంతి): రాష్ట్ర దేవాదాయ శాఖలో పనిచేసే అర్చక, ఉద్యోగులు రెండు నెలలుగా వేతనాల చెల్లింపు నిలిచిపోవడంతో అర్ధాకలి, అప్పుల బాధతో ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర అర్చక, ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డివిఆర్ శర్మ అన్నారు. 577 జీఓ అమలుకు తూట్లు పొడుస్తున్నారని , ఒకే శాఖ ఒకే వేతన విధానం అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని కురవి శ్రీ భద్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఇక్కడి ఆలయ అర్చక, ఉద్యోగులతో కాసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కురవి శ్రీవీరభద్రస్వామివారి దేవాలయ అర్చకులు రెడ్యాల శ్రీనివాస్ శర్మ, పెనుగొండ అనిల్ శర్మ, దూసకంటి విజయ్ శర్మ, అభిలాష్ శర్మ, రమేష్, వేదపండితులు బాలకృష్ణశర్మ, శ్రీకాంతాచార్యులు, ఉద్యోగి జగన్ పాల్గొన్నారు.