సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయశాఖ కమిషనర్
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఏప్రిల్ 16 (విజయక్రాంతి): కాళేశ్వరం త్రివేణి విశ్రాంతి భవనంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి గర్భాలయం, శుభానందదేవి అమ్మవారు ఆలయాల పునరుద్ధరణ, పున ప్రతిష్ట, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమాన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ, ఈఓ మహేష్, దేవాలయ చైర్మన్ మోహన్ శర్మ, సర్పంచ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 20న ఆలయ పున ప్రతిష్ట పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నందున శిలాఫలకం, భూమి పూజ పనులకు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ ఈఓ ను ఆదేశించారు. అనంతరం కమిషనర్ హనుమంతరావు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శుభానంద దేవి,సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి చేపట్టనున్న పనులను ఆర్కిటెక్చర్ సూర్యనారాయణ వివరించారు.






