15-11-2025 07:06:32 PM
జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్..
గద్వాల: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర చెల్లిస్తూ వరి, పత్తి, మక్క జొన్నలను కొనుగోలు చేయడం జరుగుతుందని, వ్యవసాయ అధికారులు రైతులకు ఇబ్బంది కలగకుండా నిబంధనల ప్రకారం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులతో వరి, మక్క, పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించే విధంగా తీసుకోవాల్సిన చర్యల పట్ల అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పత్తి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు నాణ్యత లేదని తిప్పి పంపే పరిస్థితి ఏర్పడకుండా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సీసీఐ నిబంధనల ప్రకారం తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల రైతులకు అవగాహన కల్పించాలని, రంగు మారిన పత్తి, తేమశాతం 8 నుండి 12 శాతం ఉండేలా చూసుకున్న పిదప పత్తి కొనుగోలు కేంద్రాలకు పంపించే విధంగా చూడాలన్నారు. నాణ్యతలేని పత్తిని సిసిఐ వారు తిరస్కరించడం వల్ల రైతులు అసౌకర్యానికి గురి అవుతున్నారని తెలిపారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం వర్షాలు కూడా తగ్గుముఖం పట్టినంతన వచ్చే రెండు నెలలు రైతులకు అసౌకర్యం కలగకుండా, జాగ్రత్తగా కొనుగోలు ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు.
మొక్కజొన్న సేకరణకు ఇప్పటికే మానుపాడు, క్యతూర్ లవద్ద కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మొక్కలు సేకరించడం జరుగుతుందని, మరో రెండు కొనుగోలు కేంద్రాలు రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొక్కజొన్న మద్దతు ధర క్వింటాలకు 2,400 అందించడం జరుగుతుందని, నిబంధనల ప్రకారం 14 శాతం తేమ ఉండేటట్లు చూడాలని సూచించారు. ప్రస్తుతం వరి కొనుగోలు సాఫీగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పత్తి, ధాన్యం సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, వ్యవసాయ సహాయ సంచాలకులు సంగీతలక్ష్మి, ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ బాషా, జిల్లా పౌరసరఫరాల అధికారి స్వామి కుమార్, మార్క్ ఫీడ్ డియం చంద్రమౌళి, వ్యవసాయ ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ జగ్గు నాయక్, సీసీఐ ప్రతినిధి రాహుల్, అన్ని మండలాల మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పాల్గొన్నారు.