calender_icon.png 24 June, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ సమూల నిర్మూలన మనందరి బాధ్యత

23-06-2025 10:37:04 PM

మంచిర్యాల డిసిపి భాస్కర్..

మందమర్రి (విజయక్రాంతి): డ్రగ్స్ గంజాయిని సమూలంగా నిర్మూలించాలని, డ్రగ్స్ రహిత సమాజం మనందరి బాధ్యతని యువత, విద్యార్థులు డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉంటూ, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, గంజాయి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా డెప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఏ. భాస్కర్(Mancherial DCP Bhaskar) కోరారు. యాంటీ-డ్రగ్ అవగాహణ వారోత్సవాలలో భాగంగా సోమవారం  పట్టణంలోని  తెలంగాణ మోడల్ స్కూల్‌(Telangana Model School)లో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ జీవితానికి అత్యంత కీలకమైన పునాదని ఈ సమయంలో తెలియని ఆకర్షణలకు లోనై గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడితే మీ భవిష్యత్తు అంధకార మయమవుతుందన్నారు.

ఇది కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని, మీ కలలను కూడా నాశనం చేస్తుందని, ఎన్డిపిఎస్ యాక్ట్ చాలా కఠినమైనదని, ఒకసారి ఈ కేసులో చిక్కుకుంటే జీవితాంతం దాని పర్యవ సానాలు అనుభవించాల్సి వస్తుందన్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా, గంజాయి దుష్ప్రభావాలను కళ్ళకు కట్టినట్లు చూపే దృశ్యరూపక వీడియోలను ప్రదర్శించి, వారికి అవగాహన కల్పించారు. జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీస్ శాఖ అహర్నిశలు శ్రమిస్తోందని, ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, తహసిల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీవో రాజేశ్వర్, ఎస్సై రాజశేఖర్, అదనపు ఎస్ఐ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.