26-06-2025 01:19:38 AM
గజ్వేల్ లో విద్యార్థులతో మానవహారం ప్రదర్శన అవగాహన కల్పించిన సిఐ సైదా
గజ్వేల్, జులై 25: యువత ఆనందం గుట్కా, మద్యం, సిగరెట్, గంజాయి వంటి వాటిని అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దని గజ్వేల్ సిఐ సైదా యువతకు పిలుపునిచ్చారు. గజ్వేల్ బాలుర ఎడ్యుకేషన్ హబ్ ముందు విద్యార్థులతో కలిసి మానవహారం నిర్మించి డ్రగ్స్, గంజాయి మద్యం సిగరెట్ తదితర వాటికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని, యువత ఇలాంటి వాటిని అలవాటు చేసుకోవద్దని అవగాహన కల్పించారు.
స్వల్పమైన ఆనందాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని, కష్టపడి చదివించే, పెంచి పోషించే తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని సమాజంలో గౌరవంగా మసులుకోవాలన్నారు. బాగా చదివి ఉన్నత స్థానాలకు ఎదిగినప్పుడే తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు వస్తుందని, సమాజంలో చక్కని గుర్తింపు వస్తుందన్నారు.
యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు ప్రజలకు, యువకులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలన్నారు. కార్యక్రమంలో హబ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.