01-05-2025 01:44:40 AM
కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కలిసిన బండి సంజయ్
కరీంనగర్, ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయకు మరోమారు విజప్తి చేశారు.
దీంతోపాటు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో రూ.10 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలని కోరారు. అట్లాగే శాతవాహన వర్శిటీలో “ఖేలో ఇండియా” కింద మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజప్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పా టుపై గతంలోనే కేంద్ర కార్మిక మంత్రిని బండి సంజయ్ కలిసిన విషయం తెలిసిందే. ఈరోజు మరోసారి ఈ అంశంపై చర్చించారు. కరీంనగర్ లో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రం మెడికల్ హబ్గా మారిందన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుండి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం కరీంనగర్ కు విచ్చేస్తున్నారని తెలిపారు. ఉత్తర తెలంగాణలో బీడీ కార్మికులు, నేత కార్మికులుసహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య అధికంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయడంవల్ల తమ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతోంద న్నారు.
ప్రస్తుతం ఈ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది కార్మికులు వైద్య చికిత్సకు నోచుకోకుండా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో రూ.10 కోట్ల వ్యయంతో సింథటిక్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలని కోరారు. నిత్యం అంబేద్కర్ స్టేడియంకు వేలాది మంది వస్తుంటారని, వారి సౌకర్యార్థం సింథటిక్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలని విజప్తి చేశారు. “ఖేలో ఇండియా” పథకం కింద కరీంనగర్ లోని శాతవాహన వర్శిటీలో రూ.16 కోట్ల వ్యయంతో మల్టీ పర్పస్ హాల్ ఏర్పాటుకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపారని చెప్పారు.
దీనిపై స్పందించిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(%ఐజు%) అధికారులు ఇటీవల శాతవాహన వర్శిటీని సందర్శించి మల్టీపర్పస్ హాలు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదికను రూపొందించి కేంద్రానికి పంపిన విషయాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు.
బండి సంజయ్ విజప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ కరీంనగర్ లో ఈఎస్ఐ ఏర్పాటు ప్రతిపాదనలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపామని, ఆమోదం లభించిన వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు, శాతవాహన వర్శిటీలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు అంశాలను త్వరితగతిన పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి మన్సూక్ మాండవీయ ఆదేశించారు.