06-06-2025 02:12:46 PM
హైదరాబాద్: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(BJP MP Etela Rajender) ను శుక్రవారంనాడు విచారించింది. కాళేశ్వరం కమిషన్ ఈటలను దాదాపు గంటపాటు విచారించింది. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారమంతా కేసీఆర్, హరీశ్ రావు వద్దే ఉందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదు.. ఆర్థికశాఖకు అన్ని విషయాలు తెలియవని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ''నేనేమీ చేయలేదు.. నా దగ్గర ఏం లేదు'' అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ రీడిజైనింగ్ కోసం కేబినెట్ సబ్ కమిటీని కేసీఆర్ ఏర్పాటు చేశారని చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీకి హరీశ్ రావు ఛైర్మన్ గా ఉన్నారని ఎంపీ ఈటల వివరించారు. నీటి లభ్యత అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆనకట్టల నిర్మాణం సాంకేతిక నిపుణులకు సంబంధించిన అశం అన్నారు. ఆనకట్టల నిర్మాణంపై రాజకీయ నాయకులకు ఏం తెలియదని ఈటల తెలిపారు. రైతుల డిమాండ్లతో కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Lift Irrigation Project)లో అదనపు పనులు జరిగాయన్నారు. అదనపు పనుల వల్ల ప్రాజెక్టు వ్యయం రూ. 80 నుంచి 85 వేల కోట్లకు పెరిగిందని స్పష్టం చేశారు. అప్పటికీ.. ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత వ్యయం పెరిగిందో తెలియదని ఆరోపించారు.
ఏ పార్టీలో ఉన్నా.. ఏ పదవిలో ఉన్నా నైతిక విలువలు పాటించాని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తుమ్మిడిహట్టి-చేవెళ్ల ప్రాజెక్టును(Tummidihatti-Chevella Project) రూ. 16 వేల కోట్లతో ప్రతిపాదించారని ఈటల తెలిపారు. ఆ తర్వాత తుమ్మడిహట్టి-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయం రూ. 38 వేల కోట్లకు పెంచారని చెప్పారు. కాళేశ్వరం కోసం కేసీఆర్ హయాంలో కేబినెట్ సబ్ కమిటీ వేశారని, మంత్రివర్గ ఉపసంఘం.. సీడబ్ల్యూసీ రిపోర్టులు తమ ముందు పెట్టిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తుమ్మడిహట్టి మన అవసరాలు తీర్చ లేకపోతే ప్రత్యామ్నాయం సూచించమని అడిగా మన్నారు. అప్పుడు సబ్ కమిటీ మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టాలని సూచించిందని ఈటల తెలిపారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును రూ.63 వేల కోట్లతో ప్రతిపాదించారు. తర్వాత అనేక కారణాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ. 82 వేల కోట్లకు పెరిగిందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్ పై ఆర్థిక శాఖకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ పూర్తిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినదని తేల్చిచెప్పారు.
నా కణతపై తుపాకీ పెట్టినా సరే.. నిజమే మాట్లాడతానని ఈటల రాజేందర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రిపోర్టులు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని కోరారు. కాళేశ్వరం నష్టాలకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలి.. కఠినంగా శిక్షించాలన్నారు. కాళేశ్వరం నా మానస పుత్రిక అని కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) వందలసార్లు చెప్పారని ఈటల వెల్లడించారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలని కేసీఆరే నిర్ణయించారన్నారు. మూడు బ్యారేజీల నిర్మాణంపై ఎవరు నిర్ణయం తీసుకున్నారని కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించింది. టెక్నికల్ టీమ్, కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకే కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.