15-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడిచినా, ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత లేదని బీజేపీ మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. రాష్ర్టంలో 12,769 మంది సర్పంచుల పదవీకాలం 2024 జనవరి 31న, 5717 మంది ఎంపీటీసీల పదవీకాలం 2024, మే నెలలో ముగిసిందని, అయినా ఇప్పటికీ ఈ స్థానాల్లో ఎన్నికలు జరగలేదన్నారు.
538 మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్ పర్సన్ల పదవీకాలాలు కూడా పూర్తయ్యి సంవత్సరం దాటిపోయిందని.. 130 మున్సిపాలిటీల్లో 128 మున్సిపాలిటీల పదవీకాలం పూర్తయి 6 నెలలు గడిచిందని.. అయినా ఇప్పటికీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదని తెలిపారు. శని వారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు రాజ్యాంగబద్ధమైనవని.. ఈ ఎన్నికల నిర్వహణ పూర్తి స్థాయిలో రాష్ర్ట ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో సంబంధం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. లోకల్బాడీలకు అభివృద్ధి నిధులు ప్రధానంగా కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా వస్తాయని.. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రావాసిన రూ.1514 కోట్లు నిధులు ఎన్నికలు జరగకపోవటం వల్ల నిలిచిపోయాయన్నారు.
14వ ఆర్థిక సంఘం కింద రావాల్సిన రూ.800 కోట్ల బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయన్నారు. రాష్ర్ట ప్రజలు ఈ నష్టాన్ని భరించాల్సి వస్తోందన్నారు. నిధులు ఆగిపోయి రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల లేమి కనిపిస్తోందని.. పరిస్థితులు అధ్వానంగా మారాయన్నారు.