21-06-2025 12:39:50 AM
హుస్నాబాద్ ఏసీపీ సదానందం
హుస్నాబాద్, జూన్ 20: ‘ప్రతి పౌరుడూ యూనిఫాం లేని పోలీసే‘ అని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని నొక్కిచెబుతూ, శుక్రవారం అక్కన్నపేట జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులతోపాటు గ్రామస్తులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్ విధులు, రికార్డుల నిర్వహణ, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు వంటి అంశాలపై సమగ్ర సమాచారాన్ని అందిస్తూ, పౌరులు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
పోలీస్ వ్యవస్థ పనితీరును ఏసీపీ సదానందం వివరంగా వివరించారు. ఫిర్యాదులను ఎలా స్వీకరిస్తారు, ఎఫ్ఐఆర్ నమోదు, ఒక వ్యక్తిపై కేసు నమోదైతే ఆ సమాచారం ఎలా నిక్షిప్తం అవుతుందో తెలియజేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని సీసీ కెమెరాల ప్రాముఖ్యత, పోలీసులు నిర్వహించే పెట్రోల్ కార్, బ్లూ కోలట్స్, రైటర్, సెక్షన్ ఇన్చార్జి విధుల గురించి వివరించారు. డయల్ 100కు కాల్ వచ్చినప్పుడు పోలీసులు ఎంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకుంటారు, ప్రజల రక్షణకు తీసుకుంటున్న చర్యలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
విద్యార్థి దశలో కేసు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఏసీపీ హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నియమాలు, ప్రమాదాల నివారణపై సూచనలు చేశారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా నేరం జరిగితే వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలని, సెల్ఫోన్ పోగొట్టుకుంటే సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు.
మహిళల రక్షణకు ఉన్న చట్టాలపై కూడా అవగాహన కల్పించారు. పోలీసులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని, శాంతి భద్రతలకు ప్రజల సహకారం అత్యంత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, అక్కన్నపేట ఎస్ఐ విజయభాస్కర్, ఎంఈవో రంగా, హెడ్మాస్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.