calender_icon.png 25 June, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదక ద్రవ్యాల రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

25-06-2025 01:23:22 AM

భద్రాద్రి కొత్తగూడెం జూన్ 24 (విజయ క్రాంతి)యువత,విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యసాధనకై కృషి చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ అవగాహనా వారోత్సవాల్లో భాగంగా మంగళవారంఎస్పీ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే ఆరోగ్య ప్రభావాలు,ఆర్ధిక,సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ జిల్లా పోలీసు శాఖ తరఫున నిత్యం అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

యువత,విద్యార్ధులు మాదకద్రవ్యాలు లాంటి చెడు వ్యసనాలకు బానిసలై తమ అమూల్య జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నారు.విద్యార్థి దశ నుండే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని అన్నారు.మత్తు పదార్థాలైన గంజాయి,డ్రగ్స్ వంటివి తీసుకుంటే ఆరోగ్యంపై పడే హానికర ప్రభావాలతో పాటు ఆర్ధిక నష్టాలు,సమాజంలో గుర్తింపు గౌరవం ఉండదని సూచించారు. ఈ డ్రగ్స్ నిర్మూలన కొరకు జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలని అన్నారు.

యవత,విద్యార్థులు మత్తు పదార్థాలకు, గంజాయికి దూరంగా ఉంటూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లయితే వెంటనే పోలీసులు వారికి సమాచారం అందించాలని అన్నారు. అనంతరం మిషన్ పరివర్తన్ మాదక ద్రవ్యాల సమాజ నిర్మూలనే లక్ష్యంగా తయారు చేసిన పోస్టర్లను ఆవిష్కరించి డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సైనికుల వలె పాటుపడాలన్నారు.

డ్రగ్స్ నిర్మూలన సోల్జర్ గా నమోదు చేసుకోవడానికి లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి,సీఐ శ్రీనివాస్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,1టౌన్ సీఐ కరుణాకర్,ఐటి సెల్ ఇన్స్పెక్టర్ రాము, జూలూరుపాడు సీఐ ఇంద్రాసేనారెడ్డి, అశ్వారావుపేట సీఐ నాగరాజు రెడ్డి,ఆర్‌ఐలు నరసింహారావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.