17-08-2025 12:43:54 AM
సూర్యాపేట, ఆగస్టు 16 (విజయక్రాంతి): కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చెపుతున్నదంతా అబద్ధాలేనని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడిమాతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి గోదావరిలో నీళ్లు లేవని చెప్పకుండా కాళేశ్వరం లేదని చెప్పడం అంటే కేవలం బనకచర్లకు మద్దతు ప్రకటించడమేనన్నారు.
రేవంత్రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పక్కకు పెట్టి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ను వినిపిస్తున్నాడని విమర్శించారు. కాలేశ్వరంపై ఉన్న నంది మేడారం, కన్నేపల్లి గాయత్రి పంప్ హౌస్లను ప్రారంభించారంటే కాలేశ్వరం ప్రాజెక్టు బాగున్నట్లేనని చెప్పారు. కాళేశ్వరం ద్వారా గత ఎనిమిది పంటలకు నీళ్లు ఇచ్చినట్లుగానే ఈ ప్రభుత్వం ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్లను వ్యతిరేకించి తీరాలన్నారు. గోదావరిపై ఇంకో ట్రిబ్యునల్ వచ్చిన తర్వాతనే ఏపీ ప్రాజెక్టులకు అనుమతించాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్తో పాటు సరిపడా నీళ్లు అందించి ఆదుకోవాలని సూచించారు.