11-06-2025 12:00:32 AM
కామారెడ్డి, జూన్ 10 ( విజయక్రాంతి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇవిఎం గోడౌన్ కు రక్షణ కల్పించాలని సెక్యూరిటీ సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ మంగళవారం ఆదేశించారు. మూడు నెలల సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ ను పరిశీలించారు. గోడౌన్ లో సెక్యూరిటీ కోసం ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు ఇతర సెక్యూరిటీ మెజర్మెంట్స్ పరిశీలించారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం భద్రపరిచిన గదుల తాళాలు తెరిచి ఈవీఎంలను పొందుపరిచిన బాక్సులను పరిశీలించి మళ్లీ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయా గదులకు తాళం వేసి సీలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్షన్ ఈవీఎం గోడౌన్ ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీల చేయడం జరిగిందని అన్నారు.
అలాగే ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం గోడౌన్ రక్షణ చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, కామారెడ్డి ఆర్డిఓ వీణ, ఐఎన్సి, బిజెపి, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, టిడిపి పార్టీల ప్రతినిధులు, ఎలక్షన్ డిటి అనిల్, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.