04-09-2024 12:00:00 AM
రేపు రాధాకృష్ణన్ జయంతి :
‘సీమలో ఆచార్య సింహ పీఠిక మీద/ నిలచి వచ్చినది మా తెలుగువాడు’ొ భారతీయుల ఉన్నతోన్నత మేధాప్రతిభను విశ్వమంతటికీ చాటిన మహోపాధ్యాయుడు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ను ఉద్దేశించి అన్న వాక్యాలివి. భారతీయ తాత్త్విక వేదాంత పరిమళాలను ప్రపంచమంతటికీ పంచిన కల్పతరువు రాధాకృష్ణులు. విద్యావేత్తగా, ఆచార్యునిగా, మేధావిగా, తత్త్వవేత్తగా, రాజనీతిజ్ఞునిగా, పరిపాలనా దక్షునిగా దేశవిదేశాలలో వెలుగొందిన మహామనీషి. సామాన్యునిగా జీవిస్తూనే అసామాన్యునిగా ఎదిగిన ప్రముఖులలో వీరు అత్యంత ముఖ్యులు.
రాధాకృష్ణన్ చిత్తూరు జిల్లా తిరుత్తణిలో 1888 సెప్టెంబరు 5న జన్మించారు. తిరుత్తణిలో హైస్కూల్ విద్య, నెల్లూరులో ఎఫ్ఏ దాకా చదివి మద్రాసు క్రైస్తవ కళాశాల నుండి తత్త్వశాస్త్రంలో ఎంఏ చేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1909లో తత్త్వశాస్త్ర అధ్యాపకునిగా చేరి 1918 వరకు పని చేశారు. కొంత కాలానికి మైసూరు విశ్వవిద్యాలయ తత్త్వశాస్త్ర శాఖాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. అక్కడే ఆయన విశేష బోధనా పాటవాన్ని ప్రదర్శించి అగ్రశ్రేణి ఆచార్యులుగా పేరు తెచ్చుకున్నారు.
1921లో కలకత్తా విశ్వవిద్యాలయంలో మానసిక తత్త్వశాస్త్రశాఖకు ఆచార్యులయ్యారు. అప్పుడే ఆయన ‘హిందూ తత్త్వశాస్త్రం’ అన్న గ్రంథాన్ని రాశారు. 1926లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ జీవన దృక్పథాల్ని విశ్లేషిస్తూ ఉపన్యాసాలిచ్చారు. రాధాకృష్ణన్ అసమాన ప్రతిభను గుర్తించి 1929లో గ్రేట్ బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయపు మాంచెష్టర్ కళాశాలలో ఆయనను ఆచార్యులుగా నియమించారు. 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి, 1939 నుండి 1948 వరకు కాశీ విశ్వవిద్యాలయానికి ఆయన వైస్ ఛాన్సలర్గా చేశారు. రాధాకృష్ణన్ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది.
మహోన్నత తాత్తిక దృష్టి
స్వేచ్ఛా ప్రియత్వాన్ని ఆకాంక్షించి జీవించిన రాధాకృష్ణన్ నిర్భయత్వానికి మారుపేరుగా నిలిచారు. బ్రిటీష్ ప్రభుత్వం అరాచకత్వాన్ని నిరసించి గాంధీజీ సారథ్యంలోని స్వాతంత్య్ర సమర ఆవశ్యకతను ప్రజలకు చాటి చెప్పారు. దేశం ముందు బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదు ఏపాటిదన్న ధీశాలి. గాంధీజీ 75వ జన్మదినోత్సవ వేళ వచ్చిన సావనీర్కు ఆయన సంపాదకుడు. విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ కవిత్వ తత్త్వంపై విశ్లేషణాత్మక గ్రంథం రాశారు. సర్వేపల్లి రాజనీతిజ్ఞతకు, లౌకిక ప్రజ్ఞకు రాజ్యాంగ విధాన పరిషత్ సభ్యునిగా ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు నిదర్శనంగా నిలుస్తాయి. విజయలక్ష్మీపండిట్ తర్వాత రష్యాలో భారత రాయబారిగా పనిచేశారు. ఆనాటి సోవియట్ అధినేత స్టాలిన్ రాధాకృష్ణను పిలిపించుకొని రాజకీయ, సాంస్కృతిక విషయాలను చర్చించడమే ఆయన అసమాన ప్రజ్ఞకు తార్కాణం.
1952లో భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికై 1962 వరకు కొనసాగారు. రాజ్యసభ అధ్యక్షునిగా ఆయన ఆచరించిన ఒరవడి పార్లమెంటరీ ప్రమాణాలకు మార్గదర్శకమైంది. డాక్టర్ రాజేంద్రప్రసాద్ పదవీ విరమణ అనంతరం 1962 నుండి 1967 వరకు భారత రాష్ట్రపతిగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో భారతదేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నది. భారత్పై చైనా దండయాత్ర, జవహర్లాల్ నెహ్రూ మృతి, భారత్పై పాకిస్తాన్ దండయాత్ర వంటి క్లిష్టతలమధ్య భారత ప్రజాస్వామ్య సుస్థిరతకు రాధాకృష్ణన్ కనబరచిన దేశభక్తి, ప్రజాస్వామ్య నిరతి, కార్య చాతుర్యం ఎంతగానో తోడ్పడ్డాయి.
సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప వక్త. ఆంగ్లభాషపై ఆయనకున్న పాధికారికతను, పాండిత్యాన్నీ స్టాఫర్డ్ క్రిప్స్ వంటి మహావక్తలే ప్రశంసించారు. రాధాకృష్ణన్ వేదాంతిగా కనిపించినా ఆయన రచనలన్నీ ఆధునిక ప్రపంచ సమస్యల పరిష్కారానికి ఉద్దేశించినవే. వేదాంత నీతి, ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ టాగోర్, రిలీజియన్ ఆండ్ సొసైటీ, ఈస్ట్ ఆండ్ వెస్ట్, లైఫ్ ఆఫ్ మహాత్మాగాంధీ ఆండ్ హిజ్ యాక్టివిటీస్ వంటి అనేక గ్రంథాల్లో వారి తాత్త్వికత సెలయేటి ప్రవాహంలా పరవళ్లు తొక్కుతూ దర్శనమిస్తుంది. స్వానుభవం నుండి ఉత్పన్నమైన జ్ఞానమే ఆయనను గొప్పవాడిగా మార్చింది. ‘అంతర్జాతీయ కల్లోలాలకు పరిష్కార మార్గం అహింస’ అంటారు రాధాకృష్ణన్.
అసత్య వాదన నుండి, ద్వేషం నుండి మానవులు విముక్తులై గుణోన్నతిని పొంది తమ ప్రవర్తనలో ఈశ్వర భావాన్ని ప్రకాశింప జేసినపుడు శాంతి భువిపై నెలకొంటుందంటారు. అధ్యాపకుడిగా విద్యార్థుల అభిమానాన్ని మెండుగా పొందిన మహామనీషి రాధాకృష్ణన్. వందకుపైగా బిరుదులను, గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. ఆత్మవిశ్వాసం, సంయమనం, కార్యదీక్ష, ఆత్మీయత, అణకువ, నిర్దిష్ట వ్యక్తిగత సూత్రాలు రాధాకృష్ణన్ను ఉన్నత స్థానంలో నిలిపాయి. ఏప్రిల్ 1975 ఏప్రిల్ 16న వారు కన్నుమూశారు. విద్యా రంగానికి ఆయన సేవలను స్మరిస్తూ ‘ఉపాధ్యాయ దినోత్సవం’ జరుపుకొంటున్నాం.
- డా. తిరునగరి శ్రీనివాస్