05-08-2025 08:33:12 PM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్,(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు మోడల్ స్కూళ్లలో ముఖ గుర్తింపు హాజరు నమోదు శాతం పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లు, మండల విద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విద్యార్థుల హాజరు 85 శాతానికి తగ్గకుండా ఉండాలని, క్రమం తప్పకుండా బడికి వచ్చేలా చూడాలని అన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో విద్యార్థుల హాజరు శాతాన్ని తెలియజేయాలని, రోజు పిల్లల్ని పంపించే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లో కల్పించిన అన్ని సౌకర్యాలు వినియోగంలో ఉండాలని, నిరుపయోగంగా ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్ల హాస్టళ్లలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని ఆదేశించారు. హరిత విద్యాలయ రిజిస్ట్రేషన్లలో జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కామన్ డైట్ మెనూలో కారం, నూనె మసాలా వంటి వాటిని నిర్ణీత మోతాదుకు మించి వాడొద్దని అన్నారు. మండల విద్యాధికారులు జిల్లాలోని పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలను తరచూ సందర్శిస్తూ అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలు తీరును, నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు.