ఉన్నత పాఠశాలలో విద్యార్థుల వర్గ పోరు
పాఠశాలకు సెలవు ప్రకటించగానే రోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు
ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదో తరగతి చదువుతున్న విద్యార్థులలో వర్గ పోరు ప్రారంభమైంది. మంగళవారం సాయంకాలం పాఠశాలకు సెలవు ప్రకటించిన తర్వాత పాఠశాల విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న బాలురు వర్గ పోరు కోసం విద్యార్థులు కొట్టుకున్నారు.
చక్కని విద్యాబుద్ధులు నేర్చుకుంటారని పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తే విద్యార్థులు ఒకరిని ఒకరు దూషించుకొని కొట్టుకోవడంతో మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు వారిని చూస్తూ ఉండిపోయారు. ఇంద్రవెల్లి నుండి ఉట్నూర్ కు వెళ్తున్న ఉట్నూర్ ఏ ఎస్ పి రోడ్డుపై విద్యార్థులు అలజడిని చూసి స్థానిక ఎస్సై సాయన్నకు చరవాణి ద్వారా సమాచారం అందించారు. వెంటనే ఎస్సై తన సిబ్బందితో వెళ్లి విద్యార్థులను ఇండ్లకు పంపించారు.
ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. చదువుకునే విద్యార్థులకు ప్రతిరోజు క్రమశిక్షణ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. పాఠశాల సెలవు అనంతరం రోడ్డుపై వచ్చి కొట్టుకోవడం తన దృష్టికి రాలేదన్నారు. ఈ విషయంపై విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటామని హెచ్ఎం రవీందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు రోడ్డుపై కొట్టుకుంటున్న వీడియోలను కొంతమంది తీసి వైరల్ చేస్తున్నారు.






