calender_icon.png 7 June, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ దందా @ తిరుమలగిరి

06-06-2025 12:07:12 AM

- హైదరాబాద్, జనగాం, సూర్యాపేట, తోర్రూర్ నడుమ తిరుమలగిరి

- నకిలీ పత్తి, బెల్లం దందా, మెడిసిన్, డ్రగ్స్ దందా సైతం

- వ్యాపారస్తులపై పూర్తిస్థాయిలో తనిఖీలు లేకపోవడమే.. ప్రజలకు శాపం

- కల్తీ దందాపై నిరంతరం... పోలీస్ అధికారులు నిఘా పెంచాలి

తుంగతుర్తి జూన్ 5 (విజయ క్రాంతి) :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలు రైతులకు అమ్మితే పిడి యాక్ట్ కేసు నమోదు చేస్తామని, కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నప్పటికీ, రాష్ట్ర జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్టు చందంగా, ఒక ప్రక్క రైతులు, మరొక ప్రక్క సామాన్య ప్రజలపై ,నమ్మకద్రోహాలతో కొంతమంది వ్యక్తులు తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని, దురుద్దేశంతో నకిలీ వ్యవస్థకు బానిసై, అభయం ,శుభం తెలియని రైతులు ,ప్రజలపై ప్రతాపం చూపడంతో నష్టాన్ని చవిచూస్తున్నారు.

ఈ నకిలీ పత్తి విత్తనాల దందాలో తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాదుకు, సూర్యాపేట జిల్లాకు, మరొక ప్రక్క జనగం నుండి వరంగల్ కు, తొర్రూర్ నుండి ఖమ్మం, మహబూబాబాద్ వరకు తక్కువ సమయంలో వెళ్ళుటకు జంక్షన్ గా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంగా మారింది. 

తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రాన్ని పరిశీలిస్తే.. 

గత కొన్ని సంవత్సరాల్లోనే అందనంత అభివృద్ధి కేంద్రంగా మారింది. ఈ కేంద్ర మార్కెట్ యార్డు నెలకొని ఉండడంతో ఒకపక్క స్థానిక రైతులు, మరొక ప్రక్క నియోజకవర్గ ప్రాంతాల నుండి కూడా తిరుమలగిరికి వచ్చి తాము పండించిన పంటను అమ్ముతూ, తమకు కావలసిన విత్తనాలు ఎరువులు మందులు, సరుకులను ఈ ప్రాంతంలోనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీనితో వ్యాపారస్తులకు నకిలీ దందా నిలయముగా మారింది.

గడచిన పది సంవత్సరాల కాలంలో పత్తి, మిర్చి, వరి పంటలకు సంబంధించిన, విత్తనాలు, నకిలీవి వచ్చి వేసుకుని పంట నష్టపోయిన సంఘటనలు కోకొల్లలుగా మారింది. రైతుల మాత్రం నష్టపరిహారం వచ్చే విషయంలో న్యాయం జరగకుండానే మిగిలిపోతున్నది. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా, కేసులు కూడా పలువురి పై నడుస్తున్నప్పటికీ నకిలీ దందా మాత్రం మారడం లేదు. ఏకంగా నకిలీ పత్తి విత్తనాలు తయారు చేసే ముఠా కూడా తయారైందంటే, నకిలీ దందాకు అడ్డు అడపా లేకుండా పోయింది.

దీనితోపాటు తిరుమలగిరి పట్టణానికి చెందిన పలువురు వ్యాపారస్తులు బెల్లం పట్టిక దందాలు జోరుగా చేయడం, ఈ మధ్యకాలంలో పలు బెల్లం లారీలు కూడా పట్టుకుని కేసులు నమోదైన సంఘటన ఈ ప్రాంతంలోనే చూశాము. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజలకు పిడిఎస్ బియ్యం పంపిణీ చేస్తుంటే బియ్యం దండా కూడా ఈ ప్రాంతంలోని జోరుగా జరుగుతున్నడం, ప్రభుత్వానికి బియ్యం ఎగుమతి చేయకుండా పలు మిల్లుల యాజమాన్యం కోట్ల రూపాయల నష్టం చూపించడంతో, జైలు జీవితాన్ని అనుభవించిన వారు ఈ కేంద్రానికి చెందిన వారే కావడం విడ్డూరం, ఆశ్చర్యాలకు , భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

బియ్యం కేసుల విషయంలో ఏకంగా ఎస్త్స్ర అవినీతికి పాల్పడి, ఏసీబీ అధికారులు పట్టుకొని ,సస్పెండ్ చేసి, కేసులు నమోదు చేసుకున్న సంఘటన కూడా తిరుమలగిరి కేంద్రంలో జరిగింది. ప్రజలకు వైద్యం విషయంలో  కూడా ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం, మెడికల్ మాఫియా పై కూడా గతంలో కేసులు నమోదు జరిగాయి. ప్రస్తుత తిరుమలగిరి పట్టణంలో ప్రతి వస్తువు అమ్మకాల్లో రెండవ నాసిరకం అమ్మకాలతో ప్రజలపై భారం వేస్తూ కొంతమంది వ్యాపారస్తులు మాత్రం ధనార్జ దిశగా నడుస్తూ, కోట్లు సంపాదిస్తున్నట్లు మేధావులతో పాటు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విధంగా జరుగుతున్న సంఘటనలపై రాష్ట్ర జిల్లా విజిలెన్స్ ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి, విచారణ జరిపి పీడీ యాక్ట్ కేసులు పెట్టి, చర్యలు తీసుకున్నప్పుడే, నకిలీ దందా మారుతుందని ....ఆశిద్దాం.