20-06-2025 05:11:00 PM
ఇద్దరు నిందితుల అరెస్ట్..
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని పాత బస్టాండ్ మినీ ట్యాంక్ బండ్ వద్ద నిషేధిత పత్తి విత్తనాలను తరలిస్తున్న ఇద్దరు నిందితులను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని లక్ష విలువ గల నకిలీ పత్తి విత్తనాల(Fake cotton seeds)ను స్వాధీనం చేసుకున్నారు.
పట్టణ ఎస్సై ఎస్ రాజశేఖర్(SI S Rajasekhar) తెలిపిన వివరాల ప్రకారం... గుర్తు తెలియని వ్యక్తులు పట్టణంలోని మందమర్రి (వి,) గ్రామానికి నిషేధిత పత్తి విత్తనాలు తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం పట్టణ పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు మినీ ట్యాంక్ బండ్ వద్ద తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా, వారి వద్ద ఎలాంటి పత్రాలు, బిల్లులు, లేబుల్స్ లేని 40 కిలోల నకిలీ పత్తి విత్తనాల బస్తాను గుర్తించడం జరిగిందని విత్తనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వీటి విలువ లక్ష రూపాయలు ఉంటుందని, ఈ మేరకు నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న మండలంలోని బురదగూడెం గ్రామానికి చెందిన మువ్వ గౌతం, ముండ్రు మణిలను అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ పత్తి విత్తనాలను ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్లు అంగీకరించారనీ తెలిపారు.
మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా చాకచక్యంగా వ్యవహరించి నకిలీ విత్తనాలను పట్టుకున్న ఏఎస్ఐ కె మల్లేష్, కానిస్టేబుళ్లు జె విశ్వనాథ్, సురేందర్, చైతన్య కుమార్ లను పట్టణ సీఐ శశిధర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ దాడుల్లో మండల వ్యవసాయ అధికారి జి కిరణ్మయి విస్తరణ అధికారి ముత్యం తిరుపతిలతో పాటు పట్టణ పోలీసులు పాల్గొన్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి..
పట్టణ ఎస్ఐ రాజశేఖర్..
వర్షాకాలం పంటల సీజన్ ప్రారంభమైనందున మండలంలోని రైతులు అప్రమత్తంగా ఉండి నకిలీ విత్తనాలు బారిన పడకుండా ఉండాలని పట్టణ ఎస్సై రాజశేఖర్(SI S Rajasekhar) కోరారు. పత్తి సాగు చేసే రైతులు పత్తి విత్తనాలను ప్రభుత్వం గుర్తించిన అధీకృత డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచించారు. విత్తన ప్యాకెట్పై లాట్ నంబర్, కాలపరిమితి వంటి వివరాలు సరి చూసుకోవాలని, ఎవరైనా తక్కువ ధరకు లూజు విత్తనాలు అమ్ముతామని వస్తే, వారిని నమ్మవద్దని, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని స్థానిక పోలీసులకు లేదా వ్యవసాయ అధికారులకు తెలియ జేయాలని రైతులను కోరారు.