18-06-2025 12:00:00 AM
ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఫైర్
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందున ఓట్ల కోసం రైతు భరోసా నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేస్తున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు ఇస్తే.. కాంగ్రెస్ ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా ఇస్తున్నదని మండి పడ్డారు.
ఈ సీజన్కు సంబంధించి ఇంకా కల్లాలలో వడ్లు అలాగే ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారని, ఇంకా కూడా ధాన్యం సేకరణ అయిపోలేదని ఆయన విమర్శించారు. ఈ సీజన్లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి డాంబికాలు కొట్టుకుంటూ ప్రకటన చేశారని, ఇది శుద్ధ తప్పు అని చెప్పారు. కొనుగోలు కేంద్రాలను 50 శాతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారని ఆరోపించారు. ప్రతి బస్తాకు ఐదు కిలోల నుంచి పది కిలోలు కటింగ్ చేశారని ఆరోపించారు.
అన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. ధ్యానం టెండర్ల కుంభకోణంలో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఉన్నారని, ఢిల్లీకి కూడా పంపారని ఆరోపించారు.