16-09-2025 04:48:50 PM
ఏవో పర్యవేక్షణలో పంపిణీ
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతులు మంగళవారం వలిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్దకు యూరియా కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. వలిగొండ సింగిల్ విండో వద్దకు యూరియా వచ్చిన విషయం తెలుసుకొని మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతులు లభిస్తుందో లేదని ఉరుకులు పరుగుల మీద తరలివచ్చారు. గత కొద్ది రోజుల నుండి వివిధ ప్రాంతాలలో యూరియా లభ్యం కావడం లేదని రైతులు తమకు కూడా కొరత ఏర్పడుతుంది అని భావించారు. అయితే మండల వ్యవసాయ అధికారిని అంజనీ దేవి ఉదయాన్నే సింగిల్ విండో కేంద్రం వద్దకు చేరుకొని పట్టాదార్ పాస్ పుస్తకాలు కలిగిన రైతులందరికీ యూరియా అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో సింగిల్ విండో కేంద్రం వద్ద యూరియా కోసం ఎటువంటి వివాదాలు లేకుండా యూరియా పంపిణీ కొనసాగింది.