సమస్యలు పరిష్కరించేందుకే మార్నింగ్ వాక్..
మున్సిపల్ కమిషనర్ యాదగిరి..
తాండూరు (విజయక్రాంతి): తాండూర్ మున్సిపల్ పరిధిలో ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మున్సిపల్ కమిషనర్ యాదగిరి(Municipal Commissioner Yadagiri) అన్నారు. సోమవారం తెల్లవారుజామున ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బందితో కలిసి ఇందిరానగర్ ప్రాంతం ఐదు ఆరు వార్డుల్లో పర్యటించారు. మురుగు కాల్వలో ఉన్న చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. వీధి దీపాలు, తాగునీరు వార్డుల్లో సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. భారీగా వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిసరాల శుభ్రత పాటించాలని దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నీరు నిల్వ ఉన్నచోట జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు.






