07-08-2025 11:01:46 PM
భూమి సునీల్ కుమార్..
కోదాడ: తెలంగాణ వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ కుమార్ కోదాడ మండల పరిధిలోని అల్వాలపురం రైతు వేదికలో, పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో గురువారం సాగు న్యాయ యాత్ర సమావేశాన్ని రైతులతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భూమి సునీల్ మాట్లాడుతూ, దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించబడినప్పుడే నిజమైన సాగు న్యాయం సాధ్యమవుతుందని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, నాణ్యతలేని విత్తనాలు, ఎరువుల మోసాలు, మార్కెట్లో అన్యాయం, పంటల బీమా వంటి కీలక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో పలు దేశాల్లో భూ చట్టాలను సమర్థంగా వినియోగిస్తూ రైతులు లబ్ధి పొందుతున్నారని, అలాంటి అవగాహన మన రైతులకూ ఉండాలని సూచించారు.
ప్రస్తుతం దేశంలో 200కుపైగా భూ చట్టాలు ఉన్నాయనీ, అవన్నీ రైతులకు ఉపయోగపడేలా అవగాహన కల్పించడమే ఈ యాత్ర లక్ష్యమని పేర్కొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న రైతులకు ప్రతి ఒక్కరు తలా పదిమందికి ఈ విషయాలను తెలియజేయాలన్నపిలుపునిచ్చారు.ఇది దేశంలోనే తొలిసారిగా సాగు చట్టాలపై రైతులలో లోతైన అవగాహన కల్పించేందుకు చేపట్టిన అధ్యయన యాత్రగా గుర్తించారు. అంతేకాకుండా, వినూత్న పంటల వైపు దృష్టి సారించాలని, అధికంగా ఎరువుల వాడకం వల్ల ప్రజలు అనారోగ్యానికి లోనవుతున్నారని హెచ్చరించారు. రైతులు సభలో పలు సమస్యలను తెరపైకి తెచ్చారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఆర్డీవో సూర్యనారాయణ, తహసిల్దార్ వాజీద్ అలీ, హరి వెంకట ప్రసాద్, భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి,ఏవో రజిని, , గుడిబండ ప్యాక్స్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, ఎర్రవరం ప్యాక్స్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు,జీవన్ అభిలాష్ ,మల్లేష్, ప్రవీణ్, రైతులు ,తదితరులు పాల్గొన్నారు.