1 May, 2026 | 3:33 AM

వాణిజ్య పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలి

01-05-2026 02:11 AM

కలెక్టర్  స్నేహ శబరిష్

మహబూబాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): పంట మార్పిడి తోపాటు వాణిజ్య పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ, అనిల్ కుమార్, వ్యవసాయ, ఉద్యానవన, ఐకేపీ సంబంధిత అధికారులతో ఉద్యానవన, ఆయిల్ పామ్ పంటల సాగు, ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణ, ఫార్మర్ రిజిస్ట్రీ, తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే వానాకాలం సీజన్లో రైతులు వరి ధాన్యమే కాకుండా ఇతర వాణిజ్య పంటలు, ఉద్యానవన, మల్బరీ, ఆయిల్ పామ్ తదితర పంటల వైపు మొగ్గు చూపే విధంగా చైతన్య పరచాలనీ, అధిక లాభాలు వస్తున్న నేపథ్యంలో కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలను సాగు చేస్తే దేశీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నాయని అందుకు అనుగుణంగా రైతులు పంటలు వేస్తే అధిక లాభాలు వస్తాయని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.

మొక్కజొన్న, వరి కొయ్యలను మంటల్లో కాల్చకుండా చర్యలు తీసుకోవాలని, పొలంలో వాటిని సేంద్రీయ ఎరువులుగా మార్చుకునే విధంగా చూడాలని, నేచురల్ ఫామింగ్ వైపు మోగే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు రైతు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేయాలని పీఎం కిసాన్ ద్వారా ఆన్లైన్ చేయాలన్నారు.

ఆర్ ఓ ఎఫ్ ఆర్ ఓ పట్టాల విషయంలో సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించి రైతుకు మేలు చేయు విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మల్బరీ సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాల సిబ్బంది సమన్వయ పరుచుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారని సరిత, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, ఏడిఏ లు, ఏఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.