11-06-2025 12:14:59 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
పెబ్బేరు జూన్ 10 : ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రొ ఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ద్వారా నిర్వహించే రైతు నేస్తం వ్యవసాయ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ పెబ్బేరు మండలం కంచిరావు పల్లి గ్రామ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు నేస్తం 57వ ఎపిసోడ్ లో రైతులు సేంద్రీయ ఎరువులు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, సేంద్రియ ఎరువును ఏవిధంగా ఉపయోగించాలి వాటి వల్ల రైతులకు కలగే లాభాలు ఏంటి అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. అంతకు ముందు కంచిరావు పల్లి గ్రామంలోని మహేశ్వర ట్రేడర్స్ విత్తనాల షాపును కలెక్టర్ తనిఖీ చేశారు.
ట్రేడర్ లైసెన్స్ కాపీ, స్టాక్ రిజిస్టరు పరిశీలించారు. స్టాక్ లో ఉన్న విత్తనాలను పరిశీలించి రైతులకు ఎంత ధరకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. ఎరువు ల నిల్వలను సైతం పరిశీలించారు. అనంతరం షాకాపూర్ గ్రామ రైతు వేదికలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును కలెక్టర్ సందర్శించారు. ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా అర్థం చేసుకొని అవసరమైన వాటికి సదస్సులోనే అందరిముందు పంచనామ చేసి నోటీసులు జారి చేశాక నెల రోజుల్లో పరిష్కరించడం జరుగుతుందన్నారు.ఆర్డిఓ సుబ్రమణ్యం, డి. టి నందకిశోర్, ఆర్.ఐ. రాఘవేంద్ర , మండల వ్యవసాయ అధికారి షేక్ మున్నా, రైతులు తదితరులు పాల్గొన్నారు.